News

హైకోర్టులోనే తేల్చుకోవాలి - ఎమ్మెల్యే రోజా


వైకాపా ఎమ్మెల్యే రోజాను ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసిన అంశంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ కేసు వ్యవహారం హైకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టులోనే ఈ కేసు అంశాన్ని తేల్చుకోవాలని రోజా తరఫు న్యాయవాదులకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. రోజా ఇప్పటికే క్షమాపణ చెప్పారని, లేఖ కూడా పంపారంటూ ఆమె తరఫున న్యాయవాదులు సుప్రీంకు తెలపగా.. రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు న్యాయస్థానానికి చెప్పారు. దీంతో ఆ క్షమాపణ లేఖను ఇప్పుడు ఇవ్వగలుగుతారా? అని రోజా న్యాయవాదులను సుప్రీంకోర్టు అడగగా.. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి ఈ రోజు న్యాయస్థానం సమక్షంలోనే లేఖ అందజేశారు. ఈ లేఖను సంబధిత శాఖలు, అధికారులకు పంపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టులో కేసు ముగిసిన తర్వాత మాత్రమే తాము విచారణకు స్వీకరిస్తామని మరోసారి స్పష్టం చేసింది.